ఒక పక్క బౌద్ధ మతం, జైన మతం మొదలైన మతాల ప్రభావం వల్ల, మరొక పక్క అంతరంగ విభేదాల వల్ల, హైందవ సాంప్రదాయం కకావికలమై ఉన్న తరుణంలో ఆదిశంకరుల ఆగమనం జరిగినట్టే, పాశ్చాత్య, ముగల్ సంస్కృతుల ధాటికి తట్టుకోలేక, గతంలో పరాయి ప్రభావాలని తనలో తీరుగా ఇముడ్చుకున్నట్టు ఈ కొత్త ప్రభావలని తనలో సమన్వయపరచుకోలేక భారతీయ సంస్కృతి సతమతమవుతున్న తరుణంలో, అనాది అయిన మన అధ్యాత్మిక సాంప్రదాయం సత్యమని, ప్రాచీనుల అధ్యాత్మిక అనుభూతులు నిజాలని, నిర్ధారించడానికి ఇద్దరు మహాపురుషులు 19 వ శతాబ్దపు నడిమి కాలంలో ఉదయించారు. వారు శ్రీరామకృష్ణులు, శ్రీ షిరిడీ సాయి బాబా.
వివిధ సాంప్రదాయాల నిర్ధారణభైరవి బ్రాహ్మణి అనే యోగిని ఆయనకి తంత్ర విద్య నేర్పింది. తంత్రవిద్యలోని సూక్ష్మాలన్నీ నేర్చుకుని, తంత్ర మార్గానికి పరాకాష్ట అయిన "శక్తి" లేక "దేవి" యొక్క సాక్షాక్తారాన్ని పొందారు శ్రీరామకృష్ణులు.తోతాపురి అనే అద్వైత వేదాంతి నుండి ఆత్మ విద్య నేర్చుకుని ఆ మార్గాంతంలో ఆత్మానుభూతిని పొందారు.కృష్ణుడి పట్ల గోపికలకి ఉండే మధుర భక్తిని అభ్యాసం చేత అనుభవించారు. భావాన్ని బలపరిచే బాహ్యసాధనంగా ఉంటుందని కాబోలు, ఆ దశలో ఆయన గోపికలకి మల్లె స్త్రీ దుస్తులని ధరించేవారని ఆయన జీవిత కథల నుండి తెలుస్తోంది.ఒక దశలో క్రైస్తవ సాంప్రదాయాన్ని కూడా కొంతకాలం అభ్యసించారు. తన భక్తుడైన శంభూ చరణ్ మల్లిక్ తనకి బైబిల్ చదివి వినిపించడంతో శ్రీ రామకృష్ణుల క్రైస్తవ సాంప్రదాయ నిబద్ధమైన జీవనం ఆరంభమయ్యింది. ఎన్నో రోజుల పాటూ క్రైస్తవ సాంప్రదాయానికి చెందిన ఆలోచనలతో ఆయన మానసం నిండిపోయింది. ఇక ఆ రోజుల్లో కాళీ ఆలయానికి వెళ్లడం మానుకున్నారు. ఒక రోజు ఆయన దృష్టి అలవోకగా బాల జీసస్ ని ఎత్తుకున్న మడోనా చిత్రం మీద పడింది. ఆ సమయంలో చిత్రంలోని మూర్తులు అదాటున ప్రాణం పోసుకున్నట్టు, జీసస్ తానే స్వయంగా తనలో ఐక్యం అయినట్టు ఆయనకి ఓ విచిత్రమైన అనుభవం కలిగింది.అలాగే ఇస్లాం తత్వాన్ని కూడా కొంత కాలం ఉపాసించారు. ఆ దశలో అల్లా నామాన్ని జపిస్తూ, అరబ్బుల దుస్తులని ధరిస్తూ, రోజూ ఐదు సార్లు నమాజ్ చేస్తూ గడిపేవారట. ఆ రోజుల్లో హిందూ దేవతల చిత్రాలని చూడడానికి కూడా ఇష్టపడేవారు కారట. ఆ విధంగా మూడు రోజుల ఉపాసన పూర్తి చెయ్యగానే ఆయనకి ఓ అనుభవం కలిగింది. "గంబీర వదనంతో, మెరిసే తెల్లని గడ్డంతో ప్రవక్తని పోలిన ఓ దివ్య పురుషుడు నాలో ఐక్యం చెందాడు" అని ఆయన చెప్పుకున్నారు.ఆ విధంగా ఓ శాస్త్రవేత్తలా, కఠోర నిష్ఠతో కూడా ప్రయోగాత్మక పద్ధతిలో ప్రతీ సాంప్రదాయాన్ని శోధించి, అందులోని మూల సత్యాన్ని నిర్ధారిస్తూ వచ్చారు.సహస్రాబ్దాలుగా భారతీయ అధ్యాత్మిక సంస్కృతి చాటిన ఓ ముఖ్య సందేశాన్ని - "మనిషి పుట్టుకకి లక్ష్యం దైవాన్ని తెలుసుకోవడమే" నన్న సందేశాన్ని - శ్రీ రామకృష్ణులు కూడా పదే పదే గుర్తుచేస్తారు. అయితే వ్యక్తిగతమైన అధ్యాత్మిక ఉన్నతి కోసం మాత్రమే ప్రాకులాడకుండా, తోటి మానవుల పట్ల సేవాధర్మాన్ని ("జీవే దయా నొయ్, శివ్ గ్యానే జీవ్ సేబా" - 'సాటి జీవుల పట్ల దయ చూబిస్తే సరిపోదు, జీవుడే శివుడు అన్న భావనతో సేవించాలి') కూడా గుర్తు చేస్తారు.ఆయన బోధలలోని ఈ 'మానవసేవ' అనే భావబీజాన్ని ఆయన ముఖ్యశిష్యుడు స్వామి వివేకానందుడు శ్రద్ధగా, అద్భుతంగా పోషించాడు. ఆ అంకురమే 'శ్రీరామకృష్ణా మిషన్' అనే మహా వృక్షంగా వర్ధిల్లింది. అంతవరకు ఏ కొద్ది మంది పండితులకో అందుబాటులో ఉండే విశాల భారతీయ అధ్యాత్మిక సాహిత్యం జనసామాన్యం అందుబాటులోకి వచ్చేట్టు చేసింది ఈ మిషన్.శ్రీ రామకృష్ణుల ఆగమనంతో భారత దేశ అధ్యాత్మిక పునరుద్ధరణ ఆరంభం అయ్యిందని చెప్పుకోవచ్చు.
భగవాన్ శ్రీరామకృష్ణులు ఈ అవతార పురుషుల మార్గంలో మనకు అతి సమీపకాలంలో అవతరించినవారు భగవాన్ శ్రీరమకృష్ణులు. శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులు ప్రతి ఒక్కరూ ఆయన సందేశాలలో ఒక అంశాన్ని స్వీకరించి, దానిని తమ జీవితం ద్వారానూ,రచనలూ ప్రసంగాలు వివిధ మార్గాల వారానూ ప్రపంచానికి చాటారు. ఆ శిష్యులలో ఒకరు మహేంద్రనాధ గుప్త(‘మ‘). శ్రీ రామకృష్ణుల అమృతవాక్కులను ప్రపంచానికి అందజేసే మహద్భాగ్యం పొందిన వారు ఈయన.తద్వారా ప్రపంచ మత చరిత్రలో తరగని కీర్తినార్జించారు.శ్రీ రామకృష్ణుల అమృతవాక్కులు1882వ సం|| ఫిబ్రవరిలో "మ" శ్రీ రామకృష్ణులను ప్రప్రధమంగా సందర్శించారు. ఆనాటినుండి శ్రీ రామకృష్ణుల మహాసమాధి(1886)వరకు దాదాపు 250 రోజులు ఆయన్ను దర్శించి, వారి అమృతవాక్కులను ఆలకించే భాగ్యం పొందినవారాయన.ఆయన ఉపదేశాలను తమ డైరీలో రాసుకొని, పదిలపరిచారు. ఆ తరవాత వాటిని శ్రీ శ్రీ రామకృష్ణ కథామృత పేరిట ఐదు సంపుటాలుగా వంగ భాషలో ప్రచురించారు. దీని తెలుగుఅనువాదమే శ్రీ రామకృష్ణ కథామృతము.
అవతార పురుషులు తమ సందేశాలను మానవజాతి అంతటికి వ్యాప్తి చేయ సమర్ధులైన శిష్యులను తయారుచేసి, వదలి వెళుతున్నారు.వారి సందేశాల ప్రభావం, స్ఫూర్తి ఈశిష్యులద్వారా విద్య ,కళ ,విజ్ఞానం, మతం, ఆధ్యాత్మికత అనబడే సకల రంగాలకూ వ్యాప్తి గాంచుతుంది.వారి సందేశం ఒక నూతన శాస్త్రంగా రూపుదిద్దుకొంటుంది.అప్పటివరకు ఉంటూ వస్తున్న ఏ శాస్త్రాన్నిగాని అది నిందించటమో, విమర్శించటమో , తిరస్కరించటమో చేయదు; అందుకు మారుగా ఆ శాస్త్రం మునుపటి శాస్త్రాల అన్నింటి సంకలనంగా, పరిపూర్ణ రూపంగా పరిణమిస్తుంది. ఈ విధంగ వారి సాటిలేని జీవితం ద్వారానూ,వారు వదలి వెళ్ళే సందేశాల ద్వారానూ మానవజాతికి ఒక నూతన మార్గం,కాలానుగుణమైన ఒక వెలుగుబాట ఆవిష్కృతమౌతుంది.
రామకృష్ణ కదామృతము చదువుతూవుంటే ఆ అధ్బుత దృశ్యాలు మనం చూస్తున్న అనుభూతి కలుగుతుంది.

No comments:
Post a Comment